హైదరాబాద్, ఆగస్ట్ 7 : ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో జరిగిన అక్రమాలపై సీబీఐ కేసులు ఉండటం వల్లనే కేంద్రం వద్ద కేసీఆర్ మోకరిల్లుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. జీఎస్టీ బిల్లు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు వంటి వాటిలో భాజపా పాలిత రాష్ట్రాల సీఎంల కంటే ముందే మద్దతు పలుకుతున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో జీఎస్టీ అమలు అటు నిర్మాణ రంగమే కాకుండా ఇతర రంగాలపై కూడా ప్రతికూల ప్రభావమే పడుతుందని బిల్లుకు ఆమోదం తెలిపినప్పుడు కేసీఆర్కు తెలియదా? 18శాతం జీఎస్టీ విధించడం వల్ల రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పినా, ఎలాంటి ప్రభావం చూపదంటూ సీఎస్ ఎందుకు ప్రకటన జారీ చేశారంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ ఆరోపణలన్నీ నిజం కాకుంటే మాపై కేసులు పెట్టుకోవచ్చని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.