విజయవాడ, మార్చ్ 12: నూతన ఓటర్లకు ఓటు విలువ చెప్పడానికి ఎన్నికల సంఘం ఓ ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల కోసం కొన్ని క్యాలెండర్లు సిద్దం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరించే సమాచారంతో కూడిన క్యాలెండర్లు ఇవి. 18 ఏళ్లు నిండిన నూతన ఓటర్లందరికీ వీటిని అందించనున్నారు. తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారు తమ ఓటు విలువ ఏపాటిదో తెలుసుకునేందుకు ఇందులో అన్నీ వివరణలు వుంటాయి. ప్రత్యేక ప్యాకింగ్తో ముస్తాబు చేసి ఈ క్యాలెండర్లపై కొత్త ఓటర్ల చిరునామాలు కూడా అతికించారు. ప్రస్తుతం వీటిని విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో భద్రపరిచారు. పోలింగ్ బూత్స్థాయిల్లో ఉండే అధికారుల ద్వారా త్వరలో వీటిని అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగంపై యువ ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి, వారు వేసే ఓటు విలువ వారికి ఎరుక చెప్పేందుకే ఈ వినూత్న ఆలోచనకు పూనుకున్నామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.