మళ్ళీ మోదీనే!

SMTV Desk 2019-03-12 11:00:02  loksabha elections, prime minister, election commission, congress party, times now, indian prime minister, narendra modi, rahul gandhi

న్యూఢిల్లీ, మార్చ్ 12: రానున్న లోక్‌స‌భ ఎన్నికల సందర్భంగా దేశ ప్రజల దృష్టి అంతా ఇద్దరు ముఖ్య నేతలపై పడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ..అయితే వీరిలో ఇప్పుడు ఎవరు ప్రధానిగా ఎన్నికవుతారో అని దేశమంతా ఆశక్తికరంగా ఎదురు చూస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థలు సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ప్ర‌ముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఫిబ్ర‌వ‌రి 5 నుంచి 21వ తేదీల మ‌ధ్య స‌ర్వే నిర్వ‌హించింది. మొత్తం 690 ప్ర‌దేశాల్లో 14,432 మందిని ప్ర‌శ్న‌లు అడిగి స‌మాధానాలు రాబ‌ట్టారు. త‌రువాత వాటిని విశ్లేషించారు. ఈ క్ర‌మంలో తేలిందేమిటంటే.. రాహుల్ క‌న్నా మోడీ ప్ర‌ధాని అయితేనే దేశాన్ని బాగా ముందుకు న‌డిపిస్తార‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. స‌ర్వేలో భాగంగా 52 శాతం మంది ప్ర‌జ‌లు మోడీ ప‌క్షాన నిల‌వ‌గా, రాహుల్ గాంధీ ప‌క్షాన కేవ‌లం 27 శాతం మంది మాత్ర‌మే నిలిచారు. అయితే పుల్వామా దాడి ఘ‌ట‌న త‌రువాతే అనూహ్యంగా మోడీ పుంజుకున్నార‌ట‌. ఒక్క‌సారిగా ఆయ‌న రేటింగ్ 7 శాతం పెరిగింద‌ట‌. దీంతో మోడీ అయితేనే దేశాన్ని బాగా అభివృద్ది చేస్తూ ముందుకు తీసుకుపోతార‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక ఎన్‌డీఏ ప్ర‌భుత్వానికి చెందిన ఎన్నిక‌ల హామీల విష‌యానికి వ‌స్తే మోడీ త‌మ హామీల‌ను అమ‌లు చేయ‌డంలో వెనుక‌బ‌డ్డార‌ని ప్ర‌జ‌లు చెప్పారు. ఇక ఇటీవ‌లే ప్ర‌వేశ‌పెట్టిన కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం వ‌ల్ల పెద్ద ఉప‌యోగం ఏమీ లేద‌ని ప్ర‌జ‌లు చెప్పారు. అంటే.. ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చ‌లేక‌పోయినా, జీఎస్‌టీ, నోట్ల రద్దు, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌.. వంటి ప్ర‌తికూల అంశాలు ఉన్నప్ప‌టికీ.. స‌ర్జిక‌ల్ దాడుల‌తో పాక్‌కు మోడీ ప్ర‌భుత్వం గ‌ట్టిగా బుద్ధి చెప్పిన విధానం ప‌ట్ల ప్ర‌జ‌లు సానుభూతితో ఉన్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ నేత‌లు కూడా ఇదే నినాదంతో ముందుకు వెళ్తార‌ని తెలుస్తోంది. మ‌రి స‌ర్వేలో వ‌చ్చిన ఫ‌లితాల మాదిరిగానే మోడీ రానున్న ఎన్నిక‌ల్లో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసి మ‌రోసారి ప్ర‌ధాని అవుతారా, లేదా అన్న‌ది తెలియాలంటే.. మే 23వరకు ఆగాల్సిందే.