మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ టిడిపిలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. సోమవారం రాత్రి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనతో హైదరాబాద్లో భేటీ అయ్యారు. గంటా శ్రీనివాస రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ జిల్లాలోని భీమిలి శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయనను పోటీ చేయించాలని టిడిపి భావిస్తున్నట్లు సమాచారం. ఆయన టిడిపిలో చేఋ పోటీ చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. నేడో రేపో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి టిడిపిలో చేరవచ్చునని తాజా సమాచారం.
లక్ష్మినారాయణ సిబిఐ నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన తరువాత ఏపీలో విస్తృతంగా పర్యటించారు. సొంతంగా పార్టీ పెట్టాలనుకొన్నారు కానీ ఎందుకో అటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ తరువాత ఆయన ఆలోచనలకు, ఆశయాలకు దగ్గరగా ఉన్న జనసేన పార్టీలో చేరుతారని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి కానీ ఇప్పుడు టిడిపిలో చేరుతున్నట్లు సమాచారం. ఆయన టిడిపిలో చేరుతుండటం నిజమైతే అది చాలా ఆశ్చర్యకరమైన వార్తే అవుతుంది.