రోజుకో భారీ బహిరంగ సభ, చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్

SMTV Desk 2019-03-12 07:20:51  AP cm, chandra babu,

అమరావతి, మార్చ్ 11: ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతి నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర నుండి నాయుడు రోడ్‌షో‌లను ప్రారంభించనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వచ్చే నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను చంద్రబాబునాయుడు దాదాపుగా పూర్తి చేశారు. ఈ నెల 16వ తేదీ నుండి చంద్రబాబునాయుడు తిరుపతి నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.తిరుపతిలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్న తర్వాత ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుడతారు. తిరుపతిలో సభ నిర్వహించిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాబు ఎన్నికల క్యాంపెయిన్‌కు వెళ్లనున్నారు.

ఈ నెల 16వ తేదీ లేదా మరునాడు శ్రీకాకుళం జిల్లా నేతలతో బాబు సమావేశం కానున్నారు. మరోవైపు అదే జిల్లాలో రోడ్‌షోలు నిర్వహించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రోజుకో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. వీలైనన్ని ఎక్కువ చోట్ల రోడ్‌షో‌లు నిర్వహించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా అభ్యర్ధులను ఫైనల్ చేయని జిల్లాల్లో రెండు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. ఈ నెల 13వ తేదీన చంద్రబాబునాయుడు అభ్యర్ధుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.