హైదరాబాద్, మార్చ్ 11: 2013 ఐపీఎల్ సీజన్లో జట్టు యాజమాన్యం స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2015లో చెన్నై సూపర్ కింగ్స్తో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుపై రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే దీని ఆధారంగా చేసుకొని చెన్నై సూపర్ కింగ్స్ పై తీసిన రోర్ ఆఫ్ ది లయన్ డాక్యుమెంటరీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హత్య కంటే మ్యాచ్ ఫిక్సింగ్ పెద్ద నేరమని అన్నాడు. రోర్ ఆఫ్ లయన్స్ పేరిట చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమనంపై 45 సెకన్ల ట్రైలర్ను నిర్మించారు. ఇందులో ధోనీ మాట్లాడుతూ "నా దృష్టిలో హత్య కంటే మ్యాచ్ ఫిక్సింగ్ పెద్ద నేరం. జట్టును అనుమానించారు. నాపైనా ఆరోపణలు చేశారు. కఠిన శిక్ష విధించారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మా అందరికీ అది కష్టకాలం" అని అన్నాడు. అంతేకాక "మాపై విధించిన రెండేండ్ల శిక్ష చాలా పెద్దది. తిరిగి ఐపీఎల్లో పునరాగమనం చేసిన క్షణాలు భావోద్వేగాన్ని కలిగించాయి. అభిమానులు మాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే మేం టైటిల్ గెలిచాం. అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. కఠినమైన సంఘటనలే మనల్ని మరింత బలంగా తయారుచేస్తాయని నా నమ్మకం" అని ధోని ట్రైలర్లో ధోని చెప్పాడు.