ఏప్రిల్ 11న ఎన్నికలు : సోషల్ మీడియాలపై నిఘా పెట్టిన ఈసీ

SMTV Desk 2019-03-11 11:05:33  lok sabha elections, social media, election commission

న్యూఢిల్లీ, మార్చ్ 11: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులు సోషల్ మీడియాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేసే ప్రచారం కానీ.. అందులో ఇచ్చే ప్రకటనలు కానీ.. ఎన్నికల కోడ్ కిందికే వస్తాయని ఈసీ స్పష్టం చేసింది. అందుకే.. అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడే.. సోషల్ మీడియా ఖాతాల వివరాలను తప్పకుండా సమర్పించాలని ఈసీ వెల్లడించింది. అంతే కాదు సోషల్ మీడియా ద్వారా చేసే ప్రచారానికి, ప్రకటనకు చేసే ఖర్చును కూడా ఎన్నికల ఖర్చుగానే చూపాలని ఈసీ తెలిపింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే బిల్లుల దగ్గర్నుంచి యాడ్స్, ప్రచారాల కోసం తయారు చేసే వాటికి అయ్యే ఖర్చు.. ఇలా రూపాయితో సహా అన్ని ఖర్చుల వివరాలు ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని ఈసీ తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేకంగా గ్రీవెన్స్‌సెల్‌ను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియాలో చేసే ప్రచారం, ఇచ్చే ప్రకటనలపై ఈసీ పర్యవేక్షణ ఉంటుందని సునీల్ అరోరా వెల్లడించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వ్యాప్తి చెందే ఫేక్ న్యూస్, ఇతర ధోరణులను అరికట్టడం కోసం ఈసీ నడుం బిగించిందని ఆయన వ్యాఖ్యానించారు.