హైదరాబాద్, మార్చ్ 10: తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మరో ఎమ్మెల్యే వీడనున్నారు. ఇల్లందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్ ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.... శతాబ్దాల చరిత్ర ఉన్న ఇల్లందు ప్రాంతంతో పాటు గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కేసీఆర్ కు ఉన్న విజన్ తనను ఆకట్టుకుందని, ఆయన బాటలో నడిచి బంగారు తెలంగాణ సాధనలో భాగమవుతానని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గిరిజన ప్రాంత అభివృద్ధిపై కేసీఆర్ తో చర్చించానని, స్వార్థ రాజకీయాల కోసం కాకుండా, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.