అమరావతి, మార్చ్ 09: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని ప్రతీ రైతు కుటుంబానికి రూ.8 వేల ఆర్ధిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతు కుటుంబాల్లోని ఆడపడుచుల కోసమే ఈ సాయం అంటూ స్పష్టం చేశారు. మహిళల అభ్యున్నతికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పిన ఆయన మహిళలకు తమ పార్టీలో 33 శాతం మేర పదవులు కేటాయించామని తెలిపారు. చట్టసభల్లో కూడా 33 శాతం మహిళలకే అమలు చేయాలని ఉందని, అయితే ప్రత్యర్థుల వ్యూహాలను బట్టి తన నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధి హామీలో అన్నీ అవకతవకలేనని ఆరోపించారు పవన్ కల్యాణ్. ఉపాధి హామీ పథకంతో వ్యవసాయరంగాన్ని అనుసంధానం చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.