కృష్ణకుమారి కోహ్లీకి అరుదైన గౌరవం

SMTV Desk 2019-03-09 13:20:24  Krishna Kumari Kohli, Jugnu Kohli, Parliament Member, Women Day

ఇస్లామాబాద్, మార్చి 9: పాకిస్థాన్‌లో వెట్టి కార్మికుల హక్కుల కోసం ఎన్నో ఏండ్లు కృషిచేసిన కృష్ణకుమారి కోహ్లీ (40) గతేడాది మార్చిలో సెనేటర్‌(పార్లమెంట్ సభ్యురాలు)గా ఎన్నికయ్యి తొలి మహిళగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ దేశ హిందూ దళిత సామాజిక వర్గం నుండి సెనేటర్ గా ఎన్నికైన కృష్ణకుమారి కోహ్లీకి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్రవారం ఆమె పాకిస్తాన్ పార్లమెంట్ ఎగువ సభ సమావేశానికి అధ్యక్షత వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం సెనేట్‌కు మా సహచరిణి కృష్ణకుమారి కోహ్లీ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని సెనేట్ చైర్మన్ నిర్ణయించారు అని ఫైసల్ జావెద్ అనే సెనేటర్ ట్వీట్ చేశారు. సింధ్ రాష్ట్రంలో హిందువులు అధికంగా జీవిస్తున్న నగర్‌పర్కార్ ప్రాంతంలోని మారుమూల గ్రామం ధనగామ్‌కు చెందిన కృష్ణకుమారి సామాజిక వర్గానికి చెందినవారు.

శుక్రవారం పాక్ ఎగువ సభ సమావేశాన్ని ప్రారంభించడానికి ముందు కృష్ణకుమారి మాట్లాడుతూ, సభకు అధ్యక్షత వహించే అవకాశం కల్పించడాన్ని ఎంతో అదృష్ట కరంగా భావిస్తున్నట్లు తెలిపారు. 1979లో జుగ్నూ కోహ్లీ అనే పేద రైతుకు కృష్ణకుమారి జన్మించారు. ఆమె కుటుంబ సభ్యులు ఉమెర్కోట్ జిల్లాలో ఓ భూస్వామికి చెందిన ప్రైవేట్ జైలులో దాదాపు మూడేండ్లపాటు నిర్బంధానికి గురయ్యారుఅప్పటికి ఆమె మూడో తరగతి చదువుతున్నారు. తన 16 ఏళ్ల వయసులో(తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు) లాల్‌చంద్‌ను వివాహం చేసుకున్నారు. 2013లో సింధ్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. తన సోదరునితో కలిసి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)లో చేరారు. ఆ తర్వాత కృష్ణకుమారి సోదరుడు బెరానో యూనియన్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.