న్యూఢిల్లీ, మార్చి 9: పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత వైమానిక దళం పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి తరువాత పాక్ ఉగ్రవాదుల్లో ఇసుమంతైనా మార్పు రాలేదు. ఇప్పుడు ఇంకా 22 ఉగ్రవాద శిబిరాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో తొమ్మిది మసూద్ అజర్ జైషే మహ్మద్ సంస్థకు చెందినవని భారత అధికారి ఒకరు తెలిపారు. ఆ శిబిరాలపై పాక్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రశిబిరాలపై ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సరేసరి అని, లేదంటే బాలాకోట్ పై జరిపిన వాయుదాడుల్లాంటివి మరోసారి తప్పవని పాక్కు హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి అడ్డాగా మారిందని, ఉగ్రవాద సంస్థలపై ప్రపంచం నమ్మదగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉగ్రవాదం విషయంలో పాక్ ప్రభుత్వం ఇప్పటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించిన ఆయన, రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి తమ భూభాగంలో నడుస్తున్న ఉగ్ర శిక్షణ కేంద్రాల పని పట్టాలని, లేదంటే బాలాకోట్ తరహా మరో దాడి తప్పదని ఆయన హెచ్చరించారు.