అమరావతి, మార్చి 9: బిగ్ బాస్-2 విజేత, సినీ నటుడు కౌశల్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. తెలుగు దేశం పార్టీ(టీడీపీ)లో చేరేందుకు సిద్దమయ్యారు. నిన్న(శుక్రవారం) రాత్రి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ప్రజావేదికలో కౌశల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌశల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కౌశల్ ను దగ్గరుండి తీసుకొచ్చిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇద్దరినీ సమావేశపరిచారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కూడా అంగీకరించారు. తొందర్లోనే తన పర్యటన, ప్రచారానికి సంబంధించిన కార్యాచరణను ప్రకటిస్తానని కౌశల్ చెప్పినట్టు సమాచారం. అయితే, టీడీపీ తరుపున కౌశల్ ఏదైనా నియోజకవర్గం నుండి పోటి చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ విషయం గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులతో ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్న కౌశల్, ఇప్పుడు టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడం రాజకీయాల్లో భారీ చర్చలకు దారి తీస్తుంది.