అమరావతి, మార్చి 9: ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ఓ పార్టీలో టికెట్ లభించని వారు మరో పార్టీకి మారిపోతున్నారు. గత నెల రోజులుగా ఇదే వైఖరి నడుస్తుంది ఏపీలో. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. అలాగే ఆయన స్నేహితుడు, కాంగ్రెస్ పార్టీ మరో నేత దాడి వీరభద్రరావు వైసీపీలో చేరేందుకు సిద్దం అయ్యారట.
ఈరోజు దాడి వీరభద్రరావు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసానికి వచ్చి ఆ పార్టీలో చేరుతారని పార్టీ వర్గాల సమాచారం. 2014కు ముందు దాడి, కొణతాల ఇద్దరూ కొంతకాలం వైసీపీలో పని చేశారు. ఆపై ఇద్దరూ ఆ పార్టీని వీడారు. ఇప్పుడు తమతమ రాజకీయ భవిష్యత్తు కోసం కొణతాల టీడీపీని ఆశ్రయిస్తుండగా, దాడి వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకోవడం గమనార్హం. వీరిద్దరూ చెరో పార్టీలో చేరనుండటంతో విశాఖపట్నం రాజకీయాలు సమూలంగా మారిపోనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.