ముంబై, ఆగష్ట్ 6: ఏదైనా ఉపయోగించే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అది అర్ధవంతమైనదా లేక అర్ధరహితమైనదా అనేదానికి మరొక చక్కని ఉదాహరణ ఈ యదార్థ సంఘటన. ఓ బాధితురాలి బంగారు భవిష్యత్తుకు ఫేస్బుక్ చక్కని మార్గంగా మారింది. ఫేస్ బుక్ వేదికగా కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే ఆమెకు రూ.16.5 లక్షల విరాళాలు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే ముంబైలోని నేరుల్లో ఉంటున్న మబియా మండల్ పై ఐదేళ్ల క్రితం స్వయంగా ఆమె భర్తే యాసిడ్తో దాడి చేశాడు. స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రి వారు ఉచితంగా చికిత్స చేయడంతో ఆమె ప్రాణాలను ఐతే కాపాడుకుంది కానీ, మరిన్ని సర్జరీలు ఆమెకు చేయాల్సి ఉంది. సర్జరీల కోసం భారీ వ్యయం అవుతుంది. ఈ బాధ్యతను హ్యూమన్స్ ఆఫ్ బాంబే గ్రూపు తీసుకుని, ఫేస్ బుక్ లో ఆమె పరిస్థితి గురించి తెలియజేస్తూ పోస్ట్ చేశారు. దీంతో రెండున్నర గంటల్లోనే రూ.16.5 లక్షల విరాళాలు వచ్చాయని తెలిపారు.