లాహోర్, మార్చ్ 08: ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయిద్ పై పాకిస్తాన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హఫీజ్ సయిద్ ప్రతి శుక్రవారం లాహోర్లోని జమాత్ ఉద్ దవా ప్రధాన కార్యాలయ ఆవరణలోని జామియా ఖాద్సియా మసీదులో ఉపన్యసిస్తారు. అయితే హఫీజ్ ‘శుక్రవారం ప్రసంగా’న్ని నిషేదిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా హఫీజ్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. జామియా ఖాద్సియా పంజాబ్ ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు కూడా అతని ప్రసంగాన్ని అడ్డుకోలేదు. కాని ఇప్పుడు ఆ ప్రాంతాన్ని పాక్ ప్రభుత్వం సీజ్ చేసింది. హఫీజ్ను ఆ ప్రాంతంలోకి అనుమతించేది లేదని పంజాబ్ ప్రావిన్స్ అధికారులు తేల్చి చెప్పారు. అయితే శుక్రవారం ప్రసంగించడానికి తనను అనుమతించాలంటూ హఫీజ్ కోర్టును ఆశ్రయించాడు. కానీ కోర్టు ఆ వినతిని తిరస్కరించింది.