ముంబై, ఆగష్ట్ 6: గత కొంతకాలంగా సిక్కిం సరిహద్దులోని డోక్లాం ప్రాంతంలో భారత్, చైనా దేశాల మధ్య ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల డబ్ల్యూబీఓ ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ కోసం జరిగిన బాక్సింగ్ పోరులో భారత బాక్సర్ విజేందర్, చైనీస్ బాక్సర్ జుల్పికర్ మైమైతియాలిపై విజయం సాధించాడు. శనివారం జుల్పికర్పై గెలిచిన తర్వాత విజేందర్ మీడియాతో మాట్లాడుతూ... డోక్లాం సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉద్రిక్తతలు తగ్గాలని అనుకుంటున్నా. నేను గెలిచిన డబ్ల్యూబీఓ ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ బెల్ట్ను తిరిగి ఇవ్వడం ద్వారా ఇదే సందేశాన్ని డ్రాగన్ దేశానికి పంపిస్తున్నాను. సరిహద్దులో వాతావరణం అస్సలు బాగా లేదు. నేను పంపించే శాంతి సందేశం అక్కడి మీడియా, ప్రజలకు చేరుతుందని భావిస్తున్నా అని విజేందర్ తెలిపారు. ప్రొఫెషనల్ బాక్సర్ మారిన తర్వాత వరుసగా 9వ బౌట్ గెలిచిన విజేందర్. చైనీస్ బాక్సర్పై గెలిచి రెండో టైటిల్ను దక్కించుకున్నాడు. గత నెలలోనే ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ను మట్టికరిపించి ఏషియనా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ను అతను గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్, చైనాల మధ్య శాంతి నెలకొనడం కోసమే టైటిల్ను తిరిగి ఇచ్చేయడానికి సుముఖంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.