అమరావతి, మార్చ్ 07: గురువారం నాడు ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జనవరి 11 వ తేదీ తరువాత ఏపీలో ఒక్క ఓటు కూడా తొలగించలేదని ప్రకటించారు. ఓట్లు తొలగించారని ఆరోపణలు చేసే వారు ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆన్లైన్లో ధరఖాస్తులు చేయగానే ఓట్లను తొలగించబోరని ద్వివేది చెప్పారు. తప్పుడు ధరఖాస్తులపై పోలీసు కేసులు నమోదు చేయగానే ఫారం-7ధరఖాస్తులు ఆగిపోయాయని ఆయన గుర్తు చేశారు. ఓట్ల తొలగింపు వ్యవహరంలో రాజకీయ పార్టీల వైఖరి సరిగా లేదని ఆయన ఆరోపించారు. ఏపీ రాష్ట్ర జనాభా నిష్పత్తితో పోలిస్తే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓట్లు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కువ మందికి ఓటు లేదనే విషయాన్ని ఆయన చెప్పారు.