గుంటూరు, మార్చ్ 07: జిల్లా చిలకలూరిపేటలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్య మీద కోపంతో మద్యం మత్తుల్లో తన పిల్లల్ని గొంతు కోసి చంపేసి తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల ప్రకారం...తాడేపల్లికి చెందిన రమణమూర్తి(35) చిలకలూరిపేటలో భార్య , ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్న రమణమూర్తి... కొంతకాలంగా అత్తింటివారితో ఆస్తి విషయంలో గొడవ పడుతున్నాడు. దీనికి తోడు మద్యానికి బానిసై భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం భార్యాభర్తలిద్దరికీ పెద్ద గొడవ జరగడంతో.. ఆమె తన పిల్లల్ని అతని దగ్గరే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో నిన్న రాత్రి తాగొచ్చిన రమణమూర్తి మద్యం మత్తులో పిల్లలు నాగదినేశ్(8), సాయి(6)ని గొంతుకోసి చంపాడు. ఆపై అతడు ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.