న్యూఢిల్లీ, మార్చి 7: లోక్ సభ ఎన్నికలు సమిపిస్తున్నవేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినేట్ సమావేశం ఈరోజే చివరిది. అయితే ఈ చివరి కేబినేట్ సమావేశంలో ప్రధాని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ రాజధాని లోని అనధికార కాలనీల్లో స్ధానికులకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఓ కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యాసంస్ధల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి కేంద్ర విద్యా సంస్థల ఆర్డినెన్స్ 2019కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పలు సమస్యలు ఎదుర్కొంటున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను చక్కదిద్దేందుకు మంత్రుల బృందంచేసిన సిఫార్సులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. దేశంలో చెరుకు రైతులను ఆదుకునేందుకు షుగర్ మిల్లులకు రూ. 2790 కోట్ల అదనపు నిధులను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.