న్యూఢిల్లీ, మార్చి 7: కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘాన్ని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లబ్ది చేకూర్చేందుకు లోక్ సభ ఎన్నికల ప్రణాళిక ఇంకా విడుదల చేయకుండా జాప్యం చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎన్నికల సంఘం ఉన్నతాధికారి వివరణనిచ్చారు. ఎన్నికలు నిర్వహించేందుకు తమ వద్ద కావలసినంత సమయం ఉందని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు అనాలోచితంగానే విమర్శలు చేస్తున్నాయని వెల్లడించారు. మోదీ షెడ్యూల్ తో తమకు సంబంధం లేదని, తమ షెడ్యూల్ తమకుందని అన్నారు. కాగా, 2014లో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ మార్చి 5నే వెల్లడైన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు మోదీ సర్కారు మరిన్ని పథకాలను ప్రవేశ పెట్టడం ద్వారా, ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తోందని, అందుకు ఈసీ సహకరిస్తోందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.