న్యూ ఢిల్లీ, మార్చ్ 07: భారత చిత్రాలను , TVషోలను ప్రసారం చేయరాదని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పుల్వామా ఉగ్రదాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో పాక్ సుప్రీం కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్లో భారత టీవీ ఛానెళ్లను అనుమతిస్తూ లాహోర్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
భారత అధికారులు పాక్ కంటెంట్ ప్రసారాన్ని నిలిపివేసిన క్రమంలో పాక్లో కూడా భారత కంటెంట్ను పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) నిషేధించిందని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు లాహోర్ హైకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చి పాక్ ఛానెళ్లలో భారత కంటెంట్ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.