అమరావతి, మార్చి 7: గత మూడు రోజులుగా సంచలనం సృష్టిస్తున్న ఐటీ గ్రిడ్ డేటా చోరి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో జగన్ ఏ-1 నిందితుడని చంద్రబాబు ఆరోపించారు. ఫామ్-7ను దుర్వినియోగం చేసినట్లు జగనే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. బెంగళూరు, హైదరాబాద్ నుండే ఫామ్-7 కుట్రలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఓట్లు గల్లంతయిన వారంతా జగన్ ను నిలదీయాలని సూచించారు.
2004-2009 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రానికి రౌడీయిజంతో అప్రతిష్ట వచ్చిందని, ఆ ఐదేళ్ల కాలంలో రౌడీలు బాగా పేట్రేగిపోయారన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక అసలు రౌడీయిజం ను పూర్తిగా నియంత్రించామన్నారు. అలాగే ఇప్పుడు కొందరు బాధ్యతారహితంగా, కుత్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని ఎలా కట్టడి చెయ్యాలో తనకు తెలుసునని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధి ఓ కొలిక్కి వస్తుందని, లేదంటే రాష్ట్రం మొత్తం దొంగలపాలు అవుతుందని హెచ్చరించారు.