అమరావతి, మార్చి 7: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోలులో పర్యటించారు. తన అభిమానులతో పాటు విద్యార్థులతో తాజా రాజకీయాలు, ఎన్నికల గురించి ముచ్చటించారు. ఆ తరువాత ఓ ప్రైవేట్ హోటల్లో పవన్ను తెలుగు దేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలవడం సంచలనం రేపింది. ఇద్దరు నేతలు 15 నిమిషాల పాటూ భేటీ అయ్యారు. దీంతో మాగుంట జనసేనలో చేరతారని ప్రచారం మొదలయ్యింది. అయితే ఈ భేటి వెనుక ఉన్న విషయం ఏమిటని అందరు తీస్తున్నారు. మాగుంట దంపతులు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న వేళ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దీనిపై స్పందించారు. పవన్ కల్యాణ్ తో భేటీ అయిన మాట వాస్తవమేనని. పవన్ తనకు ముందు నుండే మంచి స్నేహితుడని వ్యాఖ్యానించారు. తనతో సన్నిహిత సంబంధాలున్నాయన్నాని, వ్యక్తిగతంగానే ఆయన్ను కలిశానని స్పష్టం చేశారు. అయితే గత కొద్ది రోజులుగా మాగంటి పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నట్లు, పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నట్లు, వైసీపీ లో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాగుంట, పవన్ భేటీ కొత్త చర్చకు దారి తీసింది.