న్యూఢిల్లీ, మార్చి 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలోని కేంద్ర కేబినేట్ సమావేశం గురువారంతో ముగియనుంది. ఇదే చివరి కేబినెట్ సమావేశం అవడంతో భారీ నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. ప్రధాని కూడా చివరి కేబినెట్ సమావేశంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ భేటి తరువాత ఏ క్షణాన అయిన ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశముంది. కాగా, ప్రతి శుక్రవారం ఎన్నికల సంఘం సమావేశమై ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తుంది. అయితే రేపు శుక్రవారం కావడంతో త్రిసభ్య ఎన్నికల సంఘం సమావేశమై లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఒరిస్సా మరో రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీపై నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
శుక్రవారమే షెడ్యూల్ విడుదల చేస్తారా లేక శని ఆదివారాల వరకు ఎన్నికల సంఘం వేచి చుస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. మోదీ శనివారం ఉత్తర ప్రదేశ్, బీహార్ లో పర్యటించనున్నారు. కానీ అప్పటి వరకు ఈసీ వేచి చూస్తుందా లేక ఎన్నికల తేదీలను విడుదల చేస్తుంద అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇంకా పోతే 2014 ఎన్నికల సమయంలో ఆ ఏడాది మార్చి 5న షెడ్యూల్ విడుదల చెయ్యగా 25 రోజుల తరువాత మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 7న జరిగాయి. అయితే ఈసారి మాత్రం ఎన్నికల తేదీల ప్రకటన ఆలస్యం అయ్యాయి. ఈ నెల 10న ఎన్నికల ప్రకటన విడుదలయితే మొదటి దశ ఎన్నికలకు 25 రోజుల సమయం ఇవ్వకపోవచ్చని అంచనా వేస్తున్నారు.