హైదరాబాద్, మార్చ్ 06: ఏపీ ప్రజలకు సంబంధించిన డేటాను చోరీపై స్పందించిన హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఈ కేసులో క్రిమినల్ కంటెంట్ ఉందని స్పష్టం చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. సేవా మిత్ర యాప్ ద్వారా ఎన్నికల సరళిపై సర్వే చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారంటూ ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. అలాగే వ్యక్తిగత వివరాలతోపాటు ఆధార్ కార్డు, ఇతర ఐడీ ప్రూఫ్ లను సేకరించారని సీపీ చెప్పారు. డేటాచోరీ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘంకు తెలియజేశామని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు. వీరితోపాటు ఒక వ్యక్తికి ఎక్కడ ఓటు ఉంది, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు, ఏ పార్టీకి ఓటేస్తున్నారు వంటి అంశాలపై సేవామిత్ర ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవస్థాపకుడు అశోక్ దొరికితే మరింత సమాచారం సేకరించవచ్చునని తెలిపారు. 24 గంటల్లో విచారణకు హాజరుకావాలని అశోక్ కి స్పష్టం చేశానని అయితే ఆయన ఇప్పటికీ విచారణకు హాజరుకాలేదన్నారు.