న్యూఢిల్లీ, మార్చ్ 06: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ భవనంలో ఈ రోజు ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ప్రమాదవశాత్తు ప్రాణ నష్టం ఏం జరగలేదు. పోలీసుల కథనం ప్రకారం...బుధవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని లోధీ రోడ్లో పండిత్ దీన్దయాళ్ భవన్లోని ఐదో అంతస్తులో భారీ మంటలు చెలరేగాయి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కార్యాలయంలో మంటలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే 25 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేసింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ అధికారికి గాయాలు కాగా, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ భవనంలో భారత ఎయిర్ ఫోర్స్, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ, అటవీ శాఖ, ఎన్డిఅర్ఎఫ్తో పాటు అనేక కార్యాలయాలు ఉన్నాయి.