విజయవాడ, మార్చ్ 06: ఓట్ల తొలగింపు కేసుపై ఏపీ మంత్రి ఉమా మహేశ్వరరావు తాజాగా విజయవాడ టిడిపి కార్యాలయంలో మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగించిన కుట్రపై వైఎస్ఆర్సిపి నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని అన్నారు. ఫారం-7 ద్వారా నకిలీ దరఖాస్తులతో ఓట్లు తొలగించే కుట్రకు వైఎస్ఆర్సిపి పాల్పడుతుందని, ఈ విషయంపై ఈసికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే కేసిఆర్, బిజెపితో చేతులు కలిపి జగన్ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. సీయం గద్దె నెక్కడానికి జగన్ ఎలాంటి పనులు చేయడానికైనా వెనకాడడు అని ఉమ విమర్శించారు. అభివృద్దిని చూసి ఓర్వలేక కుట్రలకు పాల్పడుతున్నారని, అధికారమే పరమావధిగా మాట్లాడుతున్నారన్నారు. ఏపిలో 54 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని జగన్ కుట్ర పన్నారని అన్నారు.