న్యూఢిల్లీ, మార్చ్ 06: భారత్లో 2021లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ, 2023లో ప్రపంచకప్ జరనున్న నేపథ్యంలో వీటికి పన్ను మినహాయింపు కావాలని భారత సర్కార్ ను అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసిసి) కోరుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఒకవేళ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు రాకపోతే ఆమొత్తాన్ని బిసిసిఐ నే భరించాలని ఐసిసి పేర్కొంది. అయితే దీనికి బీసీసీఐ స్పందిస్తూ అది ఎంత మాత్రం కుదరదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా కావాలంటే టీ20, ప్రపంచకప్ ఈవెంట్లను నిరభ్యంతరంగా మరో దేశంలో నిర్వహించుకోవచ్చని చెప్పేసింది. తాజాగా ఐసిసి త్రైమాసిక సమావేశం జరిగింది.
భారత్లో నిర్వహించే టీ20, ప్రపంచకప్ టోర్నీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు ఇప్పించాలని బిసిసిఐని ఐసిసి కోరింది. ఒకవేళ ప్రసారదారు కోసమే ఎక్సైజ్ సుంకం మినహాయింపు కావాలంటే తర్వాత మాట్లాడుకోవచ్చని చెప్పింది. సాధారణంగా దిగుమతి చేసుకునే యంత్రాలపై సుంకం విధిస్తారు. ప్రపంచకప్ను స్టార్ నెట్వర్క్ ప్రసారం చేయనుంది.
ఇప్పటికే భారత్లో స్టార్కు సంబంధించిన పూర్తి యంత్రాలు, యంత్రాంగం ఉన్నప్పుడు ఇక మినహాయింపు ఎందుకని బిసిసిఐ ప్రశ్నించింది. క్రికెట్ ఆడుతున్న ఇతర దేశాలు ఇస్తున్నట్లు ఐసిసి మెగా ఈవెంట్లకు భారత ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడం లేదు.
ఒకవేళ ఆ ఈవెంట్లను భారత్లో కాకుండా మరో దేశంలో నిర్వహించుకోవాలని ఐసిసి భావిస్తే నిస్సందేహంగా నిర్వహించుకోవచ్చని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు.