అమరావతి, మార్చి 6: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా నరసరావుపేట బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తాను ఎవరితో పొత్తు పెట్టుకొను అని మరోసారి స్పష్టం చేశారు. దిగజారుడు రాజకీయాలను తిప్పికొట్టేందుకే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో వామపక్షాలతోనే కలిసి వెళ్తాను తప్పితే టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వైసీపీ మేనిఫెస్టో చూస్తుంటే తనకు భయమేస్తోందని, దానిని అమలు చేయాలంటే కనీసం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ కావాలని అన్నారు. మిగతా పార్టీల లాగా తాను మోసపూరిత హామీలు ఇవ్వలేనని పేర్కొన్నారు. ఏవైతే తాను నిజాయతీగా చేయగలనో, ఏవైతే అమలు చేయడానికి వీలవుతుందో అటువంటి హామీలు మాత్రమే ఇస్తానని పవన్ అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న డేటా యుద్ధం గురించి మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేతులెత్తి మొక్కుతున్నానని, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను బలిచేయొద్దని కోరారు.