హైదరాబాద్, మార్చ్ 5: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో డేటావార్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుపై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు, ఐటి గ్రిడ్స్ సీయివో అశోక్ కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 23న అశోక్ను పిలిపించి సిసిఎస్ పోలీసులు విచారించినట్లు సమాచారం. అయితే 27న మళ్ళీ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో అశోక్ 27న తన కార్యాలయంలోని కంప్యూటర్లలోని విలువైన సమచారాన్ని తొలగించినట్లు పోలీసులు గుర్తాంచారు. తొలగించిన డేటాను పొందేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మాదాపూర్లోని ఐటి గ్రిడ్స్ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. నేడు మరోసారి తనిఖీలు నిర్వహించి హార్డ్ డిస్క్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.