అమరావతి, మార్చి 5: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఎన్నికల్లో పోటిపై స్పష్టతనిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కవిటి లో ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తను పోటి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో శాసనసభ స్థానం లేదా లోక్సభ స్థాననికైన పోటీ చేయాలనుకుంటున్నట్లు వివరించారు. ఎన్నికలు అనగానే డబ్బే కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. ప్రజలు డబ్బు తీసుకొని ఓటు వేసే విధానం కాకుండా, అసలు డబ్బే తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేసేలా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కాగా, ఆయన లోక్సత్తాలోకి వెళ్తారనీ, జనసేనతో కలుస్తారనీ ఇలా పలు విధాలుగా ప్రచారాలు జరిగాయి. గతంలో రైతుల తరపున పోరాడిన ఆయన, ఏదైనా ఊరిని దత్తత తీసుకొని, వ్యవసాయంలో విప్లవాలు సృష్టించాలని భావించారు. ఆయన ఏదైనా స్వచ్చంధ సంస్థ పెడతారనే ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తాననడంతో ఆయన ఏదైనా పార్టీలో చేరతారా, లేక ఇండిపెండెంట్గా బరిలో దిగుతారా అన్నదానిపై చర్చ మొదలైంది.