న్యూఢిల్లీ, మార్చి 5: పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారు అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ దాడిలో కనీసం 300 మంది ఉగ్రవాదులు హతమై ఉంటారనేందుకు సరికొత్త సాక్ష్యం వెలుగుచూసింది. బాలాకోట్లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరంపై భారత యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించిన సమయంలో సుమారు 300 మొబైల్ ఫోన్లు యాక్టివ్గా పనిచేస్తున్నాయని జాతీయ సాంకేతిక అధ్యయన సంస్థ(ఎన్టీఆర్వో) తెలిపింది. ఆ సమయంలో సెల్ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య మాత్రమే 300 అయితే వాడని వారు కూడా మరింత మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో దాడిలో వారంతా మరణించే ఉండొచ్చని, కొందరు తప్పించుకున్నా సంఖ్య మాత్రం 300కు తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు.