అమరావతి, మార్చి 5: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఈమధ్య కాలంలో టీడీపీ నుండి వైసీపీ కి, వైసీపీ నుండి టీడీపీ కి జోరుగా వలసలు జరుగుతున్నాయి. ఇప్పుడు విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం నేడు టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇదివరకే మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి లైన్ క్లియర్ చేసుకున్నారట. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సీతారాం ఆ పార్టీలో చేరబోతున్నారు. 2014ఎన్నికల్లో వైసీపీ టికెట్పై పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని వీడి తటస్థంగా ఉంటున్నారు. రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకం కావాలన్న ఉద్దేశంతో టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.