హైదరాబాద్, ఆగస్ట్ 5 : పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో డిజిటల్ లావాదేవీల అవసరం బాగా పెరిగిపోయింది. కొన్ని రకాల డిజిటల్ పద్దతుల ద్వారా డబ్బులను చెల్లించుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. కాగా గత నెలలో చేసిన డిజిటల్ లావాదేవీల సంఖ్య వంద కోట్ల మార్కు దాటిందని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. దీనిలో భాగంగా ఏటీఎం క్లియరింగ్, భీమ్, రూపే, ఈ-కామర్స్, ఆధార్ ఆధారిత చెల్లింపులు వంటి మాధ్యమాల ద్వారా చేసిన డిజిటల్ లావాదేవీలన్ని కలిపి 100 కోట్ల మార్కు చేరుకున్నట్లు ఎన్పీసీఐ ఎండీ ఏపీ హోటా తెలియజేశారు. ఇంకో మూడేళ్ళలో ఈ లావాదేవీలు కేవలం ఒక్క రోజులోనే 100 కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 12 రకాల మాధ్యమాలు అందుబాటులో ఉండగా మొబైల్, ఆధార్ ఆధారిత చెల్లింపులను ఎక్కువ మంది వినియోగిస్తున్నారని హోటా వివరించారు. డిజిటల్ పేమెంట్స్ కమిటీ చైర్మన్ రతన్ వాటల్ మాట్లాడుతూ ఈ ఏడాది డిజిటల్ చెల్లింపులు 55 శాతం పెరిగాయి, ఇవి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నట్లు వివరించారు.