తిరుపతి, ఆగష్ట్ 5: ఇటీవల తిరుమల శ్రీవారి దేవస్థానంలో వెండి వాకిలి దగ్గర 20 అడుగుల ఎత్తులో ఇనుప మెట్లు నిర్మించారు. ఈ నేపధ్యంలో దీనిపై పండితులు ఆగమ శాస్త్రానికి విరుద్ధం అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా టిటిడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు నేడు మీడియాతో మాట్లాడారు. రద్దీ వేళల్లో భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా మెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పుడు మాత్రమే వాటి ద్వారా భక్తులను పంపిస్తాం. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏమీ లేదు ఈ మెట్ల నిర్మాణం, రద్దీ సమయాల్లో తిరుమలకు ఎలాంటి అభద్రత ధరిచేరకుండా ఉండేందుకే ఈ మెట్లను ఏర్పాటు చేశామని అన్నారు. విమానాల్లో ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్ తరహాలో ఈ ఇనుపమెట్ల నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేవస్థానంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఎన్నో పనులు చేస్తున్నారని, అపచారాలు జరుగుతున్నాయని.. మహా లఘు దర్శనం వద్దని, పవిత్రోత్సవాల్లో విమాన గోపురం పైకి పండితులు కాకుండా మిగతా వారు ఎక్కడం విరుద్ధమని చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తిరుమలకు భక్తుల రాక పతాకస్థాయికి చేరిందని, యుగధర్మం పాటించకపోతే కాలజ్ఞానం ప్రకారం ఆలయం నూరేళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈ విషయాలన్ని వివరించానని రమణ దీక్షితులు తెలిపారు.