అందుకే పార్టీ వీడుతున్నారు...

SMTV Desk 2019-03-04 20:03:17  Vijay sai Reddy, Chandrababu Naidu, Lokesh, Jaganmohan Reddy, TDP, YCP, Twitter

అమరావతి, మార్చి 4: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో సగంమంది టీడీపీ ప్రజా ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అయిష్టంతో ఉన్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం వరుస ట్వీట్లు పెట్టారు. "సగం మంది టిడిపి ఎంపీలు మళ్లీ పోటీ చేయలేమని చేతులెత్తేశారు. ఎమ్మెల్యేల పరిస్థితీ అంతే. యుద్ద శంఖారావం వినపడక ముందే రణ క్షేత్రం నుంచి పారిపోతున్నారు. అర్థమైందా చంద్రబాబూ. మీ పరాజయం ఏ స్థాయిలో ఉంటుందో. లక్షల కోట్లు వెదజల్లినా మీకు డిపాజిట్లు దక్కవు" అని అన్నారు.

అలాగే, "ఎలక్షన్ల తర్వాత తండ్రికొడుకులు చిప్పకూడు తింటారనుకున్నారంట. ముందే పోయేట్టున్నారు లోపలికి. పాపాలు ఇంత తొందరగా పండుతాయను కోలేదు. యావజ్జీవ శిక్షలకు సరిపడా తెలుగు ప్రజలకు ద్రోహం చేశారు" అని, మరో ట్వీట్ లో "గెలుపు మీద నమ్మకం లేక సిఎంగా ఉన్నవ్యక్తే ఓటర్ల జాబితాను తారుమారు చేయడం దేశంలో ఇంకే రాష్ట్రంలోనూ కనిపించదు. ఆధార్ డేటాను, ఎలక్షన్ కమిషన్ ఓటర్ డేటాను హ్యాక్ చేసి నైజీరియన్ మోసగాళ్లను మించి పోయారు తండ్రి కొడుకులు. వేల కోట్లు వెద జల్లినా ప్రయోజనం లేకపోవడంతో నీచపు పనులకు దిగారు!" అంటూ వ్యాఖ్యానించారు.