వాషింగ్టన్, మార్చ్ 3: భారత్ తమపైకి పాకిస్తాన్ ఎఫ్-16 విమానంతో దాడికి దిగింది అని ఆరోపణలు చేసింది. అయితే ఎప్-16 యుద్ధ విమానం దుర్వినియోగానికి వాడినందుకు, వాటికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాలని పాకిస్తాన్ను అగ్రరాజ్యం అమెరికా ఆదేశించింది. ఈ ఎఫ్–16 విమానాలను కేవలం తీవ్రవాద వ్యతిరేక పోరాటానికి మాత్రమె ఉపయోగించాలని, ఇతర దేశాలపై దాడికి వాడరాదని అమెరికా షరతు విధించింది. దీన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని భారత్పై పాక్ ఉపయోగించిందని అమెరికాకు ఫిర్యాదు అందింది. భారత్పై ఎఫ్-16 విమానాన్ని ఉపయోగించలేదని పాక్ ప్రకటించింది. భారత్ తమ ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసిందనడాన్ని కూడా ఖండించింది. అయితే, పాక్ ఆ విమానాలను వాడినట్టు భారత త్రివిధ దళాధిపతులు గురువారం నాటి సమావేశంలో ఆధారాలు సహా నిరూపించారు. పాకిస్తాన్ ఉపయోగించిన ఏఐఎం–120 క్షిపణి శకలాలను ఈ సమావేశంలో చూపించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు పెద్ద ఎత్తున ఆయుధాలు విక్రయించే అమెరికా వాటి వినియోగానికి సంబంధించి కొనుగోలుదారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఆ ఒప్పందాలను ఉల్లంఘించడాన్ని ఆ దేశం తీవ్రంగా పరిగణిస్తుంది. ఒబామా సర్కార్ 2016లో పాకిస్తాన్కు ఎనిమిది ఎఫ్–16 విమానాలు విక్రయించాలని నిర్ణయించింది. అయితే, అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వీటిని భారత్పైకి ప్రయోగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు