హైదరాబాద్, మార్చ్ 3: టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీని వీడి టీఆరెస్ లోకి చేరుతానని ప్రకటించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. స్వార్థం కోసం టీడీపీని వీడడం లేదని, సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో నిజాయితీగా పని చేశానని, అందుకే ప్రజలు వరుసగా మూడుసార్లు గెలిపించారని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీని ప్రజలు ఆదరించే పరిస్థితి కనిపించట్లేదన్నారు. రైతాంగం కలను నిజం చేస్తున్న కేసీఆర్కు మద్దతివ్వాలనుకున్నానని పేర్కొన్నారు. కేసులకు భయపడే వాడినైతే ఎప్పుడో పార్టీ మారేవాడినన్నారు. ఇబ్బందులున్నా టీడీపీని కాపాడాలని ప్రయత్నించానన్నారు. టీఆర్ఎస్లో ఎప్పుడు చేరేది కార్యకర్తల సమావేశంలో నిర్ణయిస్తానన్నారు.