హైదరాబాద్, మార్చ్ 2: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నేడు ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో ఆసిస్ క్రికెటర్ ఆరోన్ పించ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. పేలవ ఆటతీరుతో పరుగులేమీ సాధించకుండానే పెవిలియన్ కు చేరిన ఫించ్ తన కెరీర్లోను చెత్త రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్ ద్వారా ఫించ్ అంతర్జాతీయంగా వందో వన్డే ఆడుతున్నాడు. ఇలాంటి తన కెరీర్లో మైలురాయిగా నిలిచే మ్యాచ్ లో కూడా అతడి ఆటతీరు మారలేదు. ఇటీవల కాలంలో పరుగులు సాధించడానికి భాగా ఇబ్బందిపడుతున్న అతడు హైదరాబాద్ వన్డేలోనూ అదే సమస్యను ఎదుర్కొన్నాడు. పరుగులేమీ సాధించకుండానే ఫించ్ డకౌటయ్యాడు. ఇలా మొదట బ్యాటింగ్ కు ఎంచుకున్న ఆసిస్ కు ఫించ్ రూపంలోనే మొదటి దెబ్బ తగిలింది. భారత బౌలర్ బుమ్రా వేసిన రెండో ఓవర్లోనే అతడు డకౌటయ్యాడు. ఇలా వందో మ్యాచ్ లో డకౌటైన ఆసిస్ ఆటగాళ్ల జాబితాలో ఫించ్ చేరిపోయాడు. అంతకు ముందు డీన్ జోన్స్, క్రెయిగ్ మెక్డెర్మట్లు వందో మ్యాచ్ లో డకౌటైన ఆటగాళ్లుగా నిలవగా ఫించ్ వారి సరసన చేరిపోయాడు. అయితే ఇలా వందో మ్యాచ్ లో డకౌటైన కెప్టెన్ మాత్రం ఫించె కావడం విశేషం.