న్యూ ఢిల్లీ, ఆగస్ట్ 5 : భారత 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ సాగనుంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులందరూ ఓట్లు వేయనున్నారు. ఈ ఎన్నికల కోసం తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఆ అభ్యర్థిపై మార్కింగ్ చేసేందుకు పార్లమెంట్ సభ్యులంతా ప్రత్యేక కలాలను వినియోగిస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపును ప్రారంభించి సాయంత్రం 7 గంటల కల్లా ఫలితాలను కూడా వెల్లడించనున్నామని ఎన్నికల సంఘం అధికారులు తెలియజేశారు. అయితే ఎన్డీఏ పక్షం నుంచి కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా లోక్సభలో ఎన్డీయేకు అత్యధిక మెజారిటీ ఉండడంతో వెంకయ్య గెలుపు ఖాయమని తెలుస్తోంది.