అమరావతి, మార్చి 2: ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత మరోసారి వైసీపీ నేతలపై మండిపడ్డారు. నేరప్రవృత్తి కలిగిన జగన్ తప్పుడు మార్గంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఓటర్లను జాబితా నుండి తొలగించేందుకు దొంగలను వైసీపీ నేతలు ఊర్లలోకి పంపారని ఆరోపించారు.
అలాంటి వారు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి పరిటాల సునీత ఆవిష్కరించారు.
తరువాత మీడియాతో మాట్లాడుతూ......వైసీపీ నాయకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలా ఓట్లను తొలగించాలని చంద్రబాబు ఎన్నడూ చెప్పలేదనీ, అది జగన్ యొక్క పనేనని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సైతం లబ్ధి పొందారని మంత్రి గుర్తుచేశారు.
అలాంటప్పుడు రాబోయే ఎన్నికల్లో అసలు వైసీపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.