ప్రధాని పబ్లిసిటీ లేకుండా 5 నిమిషాలు ఉండలేరు

SMTV Desk 2019-03-02 10:57:39  Rahul Gandhi, Narendra Modi, Rally, Publicity, PM Kisan

ముంబై, మార్చి 2: మహారాష్ట్రలోని ధులే జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పుల్వామా దాడి తర్వాత దేశమంతా ఐక్యమైందంటూనే మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. అప్పుడే ఐక్యతారాగం, అంతలోనే రాజకీయం చేయడం ఆయనకే తెలుసన్నారు. పబ్లిసిటీ లేకుండా మోదీ కేవలం ఐదు నిమిషాలు కూడా ఉండలేరని ధ్వజమెత్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కాగితపు విమానాలు కూడా చెయ్యలేరని ఎద్దేవా చేశారు.

"పుల్వామా దాడి తర్వాత ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించొద్దని మా పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పాను. మనదేశం చేస్తున్న పోరాటానికి అందరం అండగా నిలవాలి" అని రాహుల్ అన్నారు. "పుల్వామా ఉగ్రదాడుల తర్వాత దేశం మొత్తం ఒక్కటైందని మీడియా ముందు చెబుతారు. వెనువెంటనే ఢిల్లీలో జరిగిన అమర వీరుల స్మారకం ప్రారంభోత్సవంలో మమ్మల్ని విమర్శిస్తారు. ఈ ప్రధాని పబ్లిసిటీ లేకుండా 5 నిమిషాలు ఉండలేరు" అంటూ విమర్శించారు. పీఎం కిసాన్‌ సమ్మన్‌ పథకం ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి కేవలం రోజుకు రూ. 17 మాత్రమే అందుతాయన్నారు. "కుటుంబంలోని ఒక్కొక్కరికి విడిగా లెక్కేస్తే రూ.3.5 వస్తుంది. రూ.3.5 లక్షల పంట రుణం ఉంటే మరోవైపు రూ.3.5 ఇవ్వడానికి మోదీ సిగ్గుపడాలి" అని విమర్శించారు.