ఇస్లామాబాద్, ఫిబ్రవరి 28: ఈ నెల 14న జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామలో భారత సీఆర్పీఎఫ్ జవనలపై జరిగిన ఉగ్రదాదిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తమ ఆధీనంలో ఉన్న భారత వైమానిక దళుడు వర్ధమాన్ అభినందన్ ను విడుదల చేస్తున్నట్లు ఇమ్రాన్ పార్లమెంట్లో ప్రకటించిన తరువాత పుల్వామా దాడి గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....మరో కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటం వల్లే మోడీ శాంతికి అనుకూలంగా స్పందించడం లేదన్నారు. ఎన్నికలకు ముందు ఏదో ఒక అవాంఛనీయ సంఘటన జరుగుతుందని తాము ముందే భయపడుతున్నామన్నారు. అనుకున్నట్లుగానే పుల్వామా ఘటన జరిగిందని ఇమ్రాన్ అన్నారు. పుల్వామా ఘటన చేసింది భారత ప్రభుత్వమని ఖచ్చితంగా చెప్పలేమని, అయితే ఘటన జరగగానే పాకిస్తాన్పై విమర్శలు చేయడంలో రాజకీయం దాగివుందని ఇమ్రాన్ ఆరోపించారు. ఎన్నికలు ముందున్నాయి కాబట్టే మోడీ శాంతికి అనుకూలంగా స్పందించట్లేదని ఆయన వ్యాఖ్యానించారు.