లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయ్ .. ఈసారి కూడా తనదైన ట్రేడ్మార్క్ స్టైల్ తో మళ్ళీ అధికారం కోసం మోదీప్రయత్నాలు చేస్తున్నారు. మోదీ బ్రాండ్ అన్నిటా కనిపిస్తోంది. తాజాగా మోదీబ్రాండ్ చీరలు హల్ చల్ చేస్తున్నాయి. బీజేపీ మహిళా కార్యకర్తలు పీఎం మోదీ ఫొటో ప్రింట్ కలిగిన చీరలను ధరించి ప్రధానిపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
నరేంద్ర మోదీ స్వంత రాష్ట్రం గుజరాత్లో రూపొందుతున్న ఈ చీరలను బీజేపీ మహిళా కార్యకర్తలు అమితంగా ఇష్టపడుతున్నారు. చీరల ఉత్పాదకులు ఈ చీరలను ఆన్లైన్లోనూ విక్రయిస్తున్నారు. మోదీ బ్రాండ్ చీరలతో పాటు మోదీ ఫోటో కలిగిన టీ షర్టులు, ఉంగరాలను అందుబాటులో ఉంచుతున్నారు. జార్ఖండ్లోని జమ్షడ్పూర్నకు చెందిన బీజేపీ మహిళా మోర్చా నేతలు ఈ చీరలను విక్రయిస్తున్నారు.
ఇవే కాదు చీరలపై బీజేపీ గుర్తు కమలం కలిగిన చీరలను కూడా అందుబాటులో ఉంచారు. ఈ చీరల ధర రూ. 1500 మొదలుకొని రూ. 4,000 వరకూ ఉంది. అలాగే కమల పుష్పం కలిగిన చీర ధర రూ. 599 మొదలుకొని రూ.1,500 వరకూ ఉంది. ఎన్నికల నాటికి ఈ చీరల విక్రయం మరింతగా పెరగగలదని అంటున్నారు.