బెంగళూరు, ఫిబ్రవరి 28: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘోరాతిఘోరమైన పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ గ్లెన్ మ్యాక్స్వెల్ వీర విజృంభణతో ఆసీస్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన ఆసీస్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
ఈ సిరీస్కు ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో అదరగొట్టిన టీం ఇండియా సొంతగడ్డపై బోర్లా పడింది. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను చేజార్చుకుంది. సొంతగడ్డపై భారత్ ఓ ద్వైపాక్షిక సిరీస్ను కోల్పోవడం 40 నెలల తర్వాత ఇదే తొలిసారి. 20 సిరీస్లు, 40 నెలల తర్వాత భారత్ ఓ అంతర్జాతీయ సిరీస్ను సొంతగడ్డపై కోల్పోయింది.