నంద్యాల, ఆగష్టు 4: నిన్న నంద్యాల బహిరంగసభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు చేసిన విమర్శలకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా జగన్పై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. జగన్ను జనజీవన స్రవంతికి దూరంగా ఉంచండి అని ప్రజలను వేడుకున్నారు. విపరీతమైన మనస్తత్వం కలిగిన జగన్ ప్రజల మధ్యలో ఉండాల్సిన మనిషి కాదని ఆయన అన్నారు. ఫ్యాక్షన్ నైజాన్ని అన్ని నేపధ్యాలలో వాడుకోవాలని చూసే వ్యక్తి అని విమర్శించారు. అధికారం కోసం కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టగల వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. 16 నెలలు కారాగారంలో ఉన్న జగన్కు పరివర్తన రాలేదు, మార్పు రావాలంటే ఎలాంటి చోట ఉంచాలి అని ప్రశ్నించారు.