అమరావతి, ఫిబ్రవరి 28: నేడు ఆంధ్రప్రదేశ్ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఎన్నికలు సమీపించినందునే కేంద్రం విశాఖ రైల్వే జోన్ ప్రకటించిందని విమర్శించారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ రైల్వే జోన్ ప్రకటన హర్షణీయమే, కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. గతంలో పార్లమెంట్ సాక్షిగా చేసిన విభజన హామీలు అమలుచేయాలన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, కేంద్రీయ విద్యా సంస్థలకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.