న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ సరిహద్దుల్లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ శిక్షణ శిబిరాలపై దాడి చేసింది. ఈ దాడి తరువాత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ బుధవారం దేశ భద్రతపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్లతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇండియా-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడితే సమర్థవంతంగా తిప్పికొట్టాలని హోం శాఖ ఆదేశించింది.
భారత్పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టం చేశారు. పాకిస్తాన్లోని అబోటాబాద్లో దాక్కున్న అల్ఖైదా అధినేత ఒసామా బిన్లాడెన్ను 2011లో అమెరికా దాడిచేసి మట్టుబెట్టిందని, భారత్కు కూడా అటువంటి సత్తా ఉందన్నారు. "ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే నాకో విషయం గుర్తుకొస్తోంది. అబోటాబాద్లోని రహస్య స్థావరంలో దాక్కొన్న లాడెన్ను అమెరికన్ నేవీ షీల్స్ చాకచ క్యంగా మట్టుబెట్టగలిగినప్పుడు మనమెందుకు ఆ పని చేయలేం? గతంలో ఇటువంటి దాడులు కేవలం మన ఊహలకు మాత్రమే పరిమితమయ్యేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. శత్రువు ఎక్కడున్నా మట్టుబెట్టే సామర్థ్యం భారత్కూ ఉంది" అని జైట్లీ అన్నారు.