ముంబై, జూన్ 1 : నటుడికి ఓ సినిమా మంచి విజయాన్ని అందిస్తే.. ఆ సినిమా కొనసాగింపుగా వచ్చే సినిమాల్లోనూ తానే నటించాలని కోరుకుంటాడు. కానీ.. సంజయ్ దత్ మాత్రం తను నటించిన ఓ సినిమాకి మూడో స్వీకెల్గా రాబోతున్న చిత్రంలో నటించమంటే కుదరదని చెప్పేశాడట. అందుకో కారణముంది. సంజయ్ దత్ 2007లో ‘ధమాల్’ అనే అడల్ట్ కామెడీ చిత్రంలో నటించాడు. 2011లో ఈ చిత్రానికి సీక్వెల్గా ‘డబుల్ ధమాల్’ చిత్రం వచ్చింది. అందులోనూ సంజయ్ నటించాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లను రాబట్టాయి. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సంజయ్.. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. ‘ధమాల్’ చిత్రానికి మూడో సీక్వెల్గా ‘టోటల్ ధమాల్’ చిత్రం తీసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు. సంజయ్ను ఈ సినిమాలో నటించడమని కోరగా అందుకు తిరస్కరించాడట. నటించనని తెగేసి చెప్పాడట. ఎందుకంటే.. అది అడల్ట్ కామెడీచిత్రం. ‘నా పిల్లలు నేను నటించిన సినిమాలు తప్పకుండా చూస్తారు. అలాంటి సినిమాలు వారు చూడటం నాకిష్టం లేదు’ అని చెప్పాడట. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నేరంపై జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన సంజయ్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ‘భూమి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ‘టర్బూజ్’, ‘సహెబ్ బివీ ఔర్ గ్యాంగ్స్టర్’ మూడో సీక్వెల్లో నటించబోతున్నాడు.