అమరావతి, ఫిబ్రవరి 27: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూల్ జిల్లలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం అహోబిలం చేరుకుని, స్వామిని దర్శించుకున్నారు. తరువాత పవన్ మీడియాతో మాట్లాడుతూ, అహోబిలం ప్రాంతం అద్భుతంగా ఉందని, ఇక్కడి వాతావరణం, ప్రకృతి అందాలు తనకు ఎంతో నచ్చాయని, ఓ మూలకు విసిరేసినట్టుగా ఉన్న అహోబిలం ప్రాంతాన్ని తిరుమలలా మార్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జిల్లాకు ముఖద్వారంగా ఉండాల్సిన అహోబిలం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిన ప్రాంతంగా ఉందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే, పర్యాటక క్షేత్రంగా, దైవక్షేత్రంగా లక్షలాది మంది భక్తులను ఆకర్షించవచ్చని అన్నారు. మంగళవారం నాడు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో జరిగిన సమావేశం గురించి మీడియా ప్రశ్నించగా, తమ మధ్య ఎటువంటి రాజకీయ అంశాలూ చర్చకు రాలేదని, కేవలం యోగక్షేమాల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని పవన్ తెలిపారు.